భారత్, ఇరాన్ బంధంపై ఖమేనీ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

  • ఇరుదేశాల మధ్య బంధం వందల ఏళ్ల నాటిదన్న అబ్దుల్ మాజిద్
  • ఇరాన్, భారత్ మధ్య సంబంధాలు, సహకారం ఉండాలని ఖమేనీ కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • తాము కూడా గణితం, ఖగోళశాస్త్రం, వైద్య విద్యను చదువుతున్నామని వెల్లడి
భారతదేశం, ఇరాన్‌ల సంబంధాలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి చెందిన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య బంధం వందల ఏళ్ల నాటిదని అన్నారు. భారత్ భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టు పురోగతిపై ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు, సహకారం ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇతర దేశాల ఆంక్షల వల్ల భారత్ ఎప్పుడూ ప్రభావితం కాలేదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మూడువేల ఏళ్ల నాటివని గుర్తు చేశారు. ఆ సమయంలో భారతదేశానికి చెందిన తాత్విక పుస్తకాలు ఉపయోగించేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం తమ విశ్వవిద్యాలయాల్లో కూడా గణితం, ఖగోళశాస్త్రం, వైద్య విద్యను చదువుతున్నామని అన్నారు.

కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో పాటు అణు కేంద్రాలపై నిఘా పెట్టి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ఇటీవల నిరసనలను విమర్శిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అత్యవసర సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. దీనిపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహ్మద్ పథాలి స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Ayatollah Ali Khamenei
India Iran relations
Chabahar port
Abdul Majid Hakim Elahi
Iran nuclear program

More Telugu News